తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
*మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలచారి
హైదరాబాద్, ట్రైనెట్, న్యూస్ 11: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ఉష మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మల్లాది ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా "సకల కళల సమ్మేళనం" కార్యక్రమాన్ని
చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సముద్రాల వేణుగోపాల చారి పాల్గొని వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు త్రినాధరావు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ తో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉష మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ లక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు మల్లాది ఉష రాణి నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులచే సినీ, గీతాలు, భక్తి సంగీత కళాకారులచే అన్నమాచార్య సంకీర్తనలతో పాటు జానపద కోలాటం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్లాది విష్ణుకుమార్ పాల్గొన్నారు.




