నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్ హాలియా: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హాలియా వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహావీర్ కాంప్లెక్స్లో ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయబద్ధంగా గోరింటాకు వేడుకను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోట చేరి పాటలు, సరదా కార్యక్రమాలతో ఉత్సాహంగా గడుపుతూ వేడుకను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న గోరింటాకు వేడుకను మహిళలంతా కలిసి నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసం ప్రత్యేకతను, మహిళల మధ్య స్నేహభావాన్ని చాటేలా కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షురాలు పాంపాటి నిర్మలాదేవి, ప్రధాన కార్యదర్శి నీలా ఉషారాణి, సెక్రటరీ నీలా పద్మ, వాసవి క్లబ్ రీజియన్ సెక్రెటరీ కుక్కడప్ప ఝాన్సీ లక్ష్మీతో పాటు వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేయడంతో కార్యక్రమం సందడిగా, ఆనందంగా సాగింది. మహిళల ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.






