ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ నెల 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారి నిరాహార దీక్ష: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వీరేందర్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు ఈ నెల 24, 25 తేదీల్లో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వీరేందర్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ శ్రీమతి బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు శ్రీ గణేష్
కుంధే, యువమోర్చా నాయకులు
తదితర నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాల చెలగాటం:
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని వీరేందర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో సుమారు 20 లక్షల మంది విద్యార్థుల చదువులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోవడంతో ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉధృతంగా యువమోర్చా పోరాటం – 5 లక్షల మంది విద్యార్థుల సంతకాల సేకరణ:
ఈ విద్యా సంక్షోభంపై స్పందించిన భారతీయ జనతా యువమోర్చా (BJYM), రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలం, జిల్లాలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించి రాష్ట్ర నాయకత్వానికి అందజేయడం జరిగింది.
పోలీసు ఆంక్షలు అప్రజాస్వామికం – బీజేపీ కార్యాలయంలోనే నిరాహార దీక్ష:
విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు ప్రజాస్వామ్యబద్ధంగా తలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఇందిరాపార్క్ లేదా ధర్నా చౌక్ వద్ద కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ గారు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు, దీక్షలు నిర్వహించారని గుర్తుచేశారు; ఇప్పుడు కూడా విద్యార్థుల సమస్యలపై దీక్ష చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అనుమతి నిరాకరించడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్బంధాలు, ఆంక్షలకు బీజేపీ వెనకడుగు వేయబోదని, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలోని పార్కింగ్ ప్రాంగణంలోనే రాంచందర్ రావు గారు నిరాహార దీక్ష చేపడతారని స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యార్థి లోకానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని వీరేందర్ గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యల పరిష్కారానికి బీజేపీ పూర్తి స్థాయిలో పోరాడుతుందని పిలుపునిచ్చారు.




