రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23: ఉత్తరా సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కుమారి కె. ఆర్. భావికా రెడ్డి భరతనాట్య అరంగేట్రం ప్రదర్శన ఆదివారం రాత్రి రవీంద్రభారతి లో రసరమ్యంగా ప్రదర్శించారు. 'అభినయ కళారత్న' గురు గీతా గణేశన్ శిష్యురాలు కుమారి కె. ఆర్. భావికారెడ్డి ఏడేళ్ల వయసులో భరతనాట్య శిక్షణను ప్రారంభించి, పదేళ్లుగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. అరంగేట్రంలో సంప్రదాయ భరతనాట్య మార్గాన్ని అనుసరిస్తూ నృత్తం, అభినయం, భక్తి భావాల సమ్మేళనంతో విభిన్న నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా పుష్పాంజలి, గణపతిని స్తుతించే మడగజ ముఖనే, ప్రధాన అంశంగా తమిళ పదవర్ణం “మోహమాయినేన్” ప్రదర్శించింది.
అనంతరం రామాయణంలోని పలు ఘట్టాలను ఆవిష్కరించే “రాజీవ నేత్రాయ”, శ్రీకృష్ణుడు, రాధ, గోపికల హోలీ వేడుకలను వర్ణించే మరాఠీ కృతి “ఆజ్ గోకుల”, కన్నడ జావళి “సాకో నిన్న స్నేహ”లను భావికా ప్రదర్శించారు.
ఉత్సాహభరితమైన తిల్లానాతో నృత్య ప్రదర్శన ముగిసిoది.
సంస్కృతం, తమిళం, మలయాళం, మరాఠీ, కన్నడ భాషలకు చెందిన కృతులతో రూపొందించిన ఈ ప్రదర్శన భరతనాట్యంలోని నృత్త వైభవం, అభినయ సౌందర్యం, భక్తి భావనతో పాటు భారతీయ సంగీత–సాహిత్య వైవిధ్యాన్ని ప్రతిబింబించింది. కార్యక్రమానికి గురు శ్రీమతి గీతా గణేశన్ నట్టువాంగం, గాత్ర సహకారం అందించగా, కె. రాజగోపాల చారి మృదంగం, ఆర్. దినకర్ వయోలిన్, జె. దత్తాత్రేయ వేణువు, ఆర్. శ్రీకాంత్ తబలాపై సంగీత సహకారం అందించారు.








