యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు. నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ విశ్వనాథ్ చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కళా జనార్ధన్ మూర్తి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలని, ముఖ్యంగా యువత దేశం పట్ల బాధ్యత, దేశభక్తి భావాలను పెంపొందించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు త్రినాధరావు, ప్రముఖ కవులు రఘుశ్రీ, మిద్దె సురేష్, ఫోటోగ్రాఫర్ సుధీర్, గానసభ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





