ఉన్నతమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. శ్రీవాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ, శ్రీనటరాజ నృత్య సంగీత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో “నాట్య గణపతికి నాట్య పుష్పాంజలి” పేరిట వివిధ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసి పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేశామని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం నాట్య గురువులకు నృత్య చూడామణి అవార్డులను అందజేశారు.
సభకు ముందు వినాయకునికి నృత్య కళాకారులు నాట్య రూపంలో పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు బి. నాగేంద్ర యాదవ్, ప్రోగ్రామ్ ఇన్చార్జ్ దివ్య లక్ష్మి, కళాభిమానులు, నృత్యాభిమానులు పాల్గొన్నారు.







