సూర్యపేట్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 12:
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ నెల 19న నిర్వహించనున్న భారీ "మెగా జాబ్ మేళా"ను జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ధి శ్రావ్య సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి సూచనలతో, కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో కోదాడలోని సిసి రెడ్డి కాన్వెంట్ స్కూల్లో ఈ ఉపాధి నియామక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ఈ నెల 19న ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాలో దేశంలోని వివిధ రంగాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలు పాల్గొంటున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతీ యువకులు అందరూ దీనికి అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగా ఆయా కంపెనీలలో నేరుగా ఇంటర్వ్యూల ద్వారా తక్షణ కెరీర్ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.నిరుద్యోగ యువత ఎలాంటి మధ్యవర్తులను నమ్మకుండా, నేరుగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఉద్యోగాలు పొందేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆమె అన్నారు. అభ్యర్థుల నమోదు ప్రక్రియ కోసం ప్రాంగణంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ సహాయక కౌంటర్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి నిరుద్యోగికి ఈ సమాచారం చేరేలా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువత తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, బయోడేటా వంటి పూర్తి వివరాలతో సకాలంలో హాజరై, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా విజయవంతం చేయాలని శ్రావ్య సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.





