అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటమే ఐలమ్మకు నిజమైన నివాళి
రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10:
ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి దిశగా తీసుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజనుల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వి.హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చాకలి ఐలమ్మ సేవలను, పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ మెడికల్ కాలేజీకి ఆమె పేరు పెట్టామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో బీసీల జనాభా లెక్కలను కూడా తేల్చాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే కచ్చితమైన గణాంకాలు అవసరమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ బహుజనుల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకురాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సామాజిక అన్యాయాన్ని, దోపిడీని, పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. మహనీయుల జయంతులు, వర్థంతులను నిర్వహించడం మాత్రమే కాకుండా వారి పోరాట స్ఫూర్తిని నేటి యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సర్వాయి పాపన్న, పండగ సాయన్న, చాకలి ఐలమ్మ వంటి మహనీయులు అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. సమాజం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ నేటికీ వివక్ష కొనసాగుతుండటం అత్యంత బాధాకరమన్నారు. సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోయే వరకు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.





