హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 31:
ఏ ఐ సి సి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పై, బీహార్ లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం అబిడ్స్ లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఒక దేవాలయంలోకి వెళ్లి వస్తే ఆ దేవాలయాన్ని బిజెపి పార్టీ నాయకులు శుద్ధి చేయడం పై మండిపడ్డారు. బీహార్ లో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల, విద్యార్థుల పట్ల బిజెపి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. బిజెపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కో ఇంచార్జ్ లు రోషిని జైస్వాల్, భవ్య, శక్తి సూపర్ షి రాష్ట్ర సమన్వయకర్త విద్యా రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, తేజ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ తదితరులు పాల్గొన్నారు.






