బోయిన్ పల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7 :
సికింద్రాబాద్ తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయం సెంటర్ పాయింట్ లోని మహావీర్ టిఫిన్ అండ్ మీల్స్ లో ఓ కస్టమర్ కు వడ్డించిన సాంబార్లో జలపురుగులు కనిపించిన ఘటన కలకలం రేపింది. టిఫిన్ తింటున్న సమయంలో సాంబార్లో చిన్నచిన్న పురుగులు కదులుతున్నట్లు గుర్తించిన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వీడియో తీసినట్లు తెలిపారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో కంటోన్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆశిష్ చౌహాన్ హోటల్ లో తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించినట్లు, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు, హోటల్ యజమాని మాట్లాడుతూ తాము సుమారు 30 ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నామని, గతంలో తమపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. సాంబార్ లో జిల్లపురుగు కనిపించిన విషయం వాస్తవమేనని, అది ఎలా జరిగిందో తమకు తెలియదని చెప్పారు. అధికారులు హోటల్ను తనిఖీ చేశారని, తమవైపు తప్పిదం నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కంటోన్మెంట్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, స్వీట్ షాపుల్లో ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, ఒక ఘటన ఆధారంగా మొత్తం హోటళ్లపై ఆరోపణలు చేయకుండా, ప్రతి ఫిర్యాదును ఆధారాలతో పరిశీలించి వాస్తవాలు నిర్ధారించాలని పలువురు సూచిస్తున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, ముడి పదార్థాల నిల్వ, ఫుడ్ లైసెన్సుల వంటి అంశాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.







