హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15:
కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబయ్యాయి. సెప్టెంబరు 15వ ధ్వజారోహణంతో వాహనసేవలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు సాగే వాహన సేవలను తిలకించే భక్తులకు విశేష సేవలు అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భారీ భారీ బందోబస్తూ మధ్య బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. అధికమాసం కారణంగా శ్రీవారికి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించబోతోంది. సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం మీనా లగ్నంలో 6గంటల 35నిమిషాలకు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగరవేయనున్నారు. ధ్వజారోహణం కార్యక్రమం అనంతరం రాత్రి 9గంటలకు పెద్దశేష వాహనంతో పూర్తిస్థాయిలో వాహనసేవలు ప్రారంభం కానున్నాయి.
అందంగా ముస్తాబైన మాడ వీధులు
బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయ గోపురం, కనుమ రహదారులు, పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై విహరించే మాడ వీధులను అందంగా ముస్తాబు చేశారు. ఆలయ గోపురంపై విద్యుత్ దీలంకరణలు, తిరుమల పరిసరాల ప్రాంతాల్లో దీపాలంకర చేశారు. వాహన సేవలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులూ లేకుండా గ్యాలరీలతో పాటు హారతుల క్యూ పాయింట్లను ఏర్పాట్లు చేశారు. గతేడాది లాగే పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ మాడ వీధుల్లో ప్రతి గ్యాలరీలో మరుగుదొడ్లను,ఆలయం చుట్టూ ప్రక్కల జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు పోలీసుశాఖ, విజిలెన్స్ శాఖ నుంచి 6300 మంది సేవలదించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విధులకు వచ్చే పోలీసుశాఖ, శ్రీవారి సేవకులతో టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బంది పరస్పరం సమన్వయం చేసుకొని పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ఉద్యానవనశాఖ ఫలపుష్ప ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రదర్శన శాలలో మూడు యుగాలకు సంబంధించిన దేవత మూర్తుల ప్రతిఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. టన్నుల కొద్ది పుష్పాలతో దేవతామూర్తుల అలంకరణలు, పలు రకాల సంప్రదాయ వృక్షాలు, తిరుమల చరిత్రకు సంబంధించిన చిత్రాల ప్రదర్శనలతో భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఘనంగా చాప, తాడు ఊరేగింపు
మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే చాప, తాడు ఊరేగింపు ఘనంగా జరిగింది. పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన చాప, తాడును ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు టీటీడీకి అటవీశాఖ ఇవ్వడం ఆనవాయితీ. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో ఈ విష్ణు దర్భను సేకరిస్తారు. ఇందుకోసం అటవీశాఖ సిబ్బంది ఎన్నోరోజులు శ్రమిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో చాప, తాడుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి తీసుకువచ్చారు. టీటీడీ అధికారులకు వీటిని రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. సెప్టెంబరు 15వ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.







