హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
సెప్టెంబర్ 19:: రాష్ట్రంలోని యువతకు విమానయాన రంగంలో నాణ్యమైన సాంకేతిక, ప్రాక్టికల్ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ పాత ఎయిర్ పోర్ట్ లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (TGSAA)తో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డా.కె.కేశవరావు సమక్షంలో శనివారం కీలక ఒప్పందం జరిగింది. కాలేజియేట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏఎంఈ శిక్షణకు పరిశ్రమ ఆధారిత అనుభవం: ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ (JNGP)లో నిర్వహించే మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్(AME) ట్రైనింగ్ డిప్లొమా ప్రోగ్రామ్ కు మరింత ప్రాక్టికల్, పరిశ్రమ ఆధారిత శిక్షణ అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సైద్ధాంతిక విద్యతో పాటు ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్, విమానాల పరిచయం, ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్పై శిక్షణ, చివరి ఏడాదిలో పరిశ్రమ ఆధారిత ప్రాక్టికల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ కల్పించనున్నారు.
2,100 గంటల ప్రాక్టికల్ శిక్షణ: మొదటి రెండు సంవత్సరాల్లో జెఎన్జీపీ /టీజీసా ఆధ్వర్యంలో థియరీ, ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్, ఎయిర్క్రాఫ్ట్ ఫ్యామిలియరైజేషన్, సిస్టమ్స్ ట్రైనింగ్ అందిస్తారు. చివరి ఏడాదిలో టీజీసాలో ఒక సంవత్సరం పాటు 2,100 గంటల ప్రాక్టికల్ వర్క్ ఎక్స్ పీరియన్స్/ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అందించడం ఈ MoUలోని ప్రధాన ప్రత్యేకత.
విమానయాన పరిశ్రమతో ప్రత్యక్ష అనుసంధానం:
టీజీసా అనుభవజ్ఞులైన శిక్షకులను అందించడంతో పాటు, ప్రాక్టికల్ ల్యాబొరేటరీ సౌకర్యాలు, ప్రత్యేక విమానాల యాక్సెస్, విమాన నిర్వహణపై ప్రాక్టికల్ ఎక్స్ పోజర్, మెయింటెనెన్స్ ఏరియాలో పని అనుభవాన్ని అందించనుంది. దీంతో విద్యార్థులకు ఎయిర్లైన్స్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్లు, MROలు, ఏరోనాటికల్ తయారీ, ఏరోస్పేస్ రంగాలపై ప్రత్యక్ష అవగాహన, పరిశ్రమ అనుభవం పొందే అవకాశం ఏర్పడుతుంది.
ఏవియేషన్ సేఫ్టీకి ప్రాధాన్యత: విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థులకు తప్పనిసరి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బ్రీఫింగ్స్ నిర్వహించడంతో పాటు ఏఏఐ , బీసీఏఎస్ సంబంధిత నిబంధనలను పాటించేలా శిక్షణ అందించనున్నారు. నైపుణ్యంతో కూడిన యువతకు బలమైన పునాది: ఈ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్యా వ్యవస్థను విమానయాన పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులు తరగతి గది పరిజ్ఞానంతో పాటు వాస్తవ విమాన నిర్వహణ వాతావరణంలో ప్రాక్టికల్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. నిర్దేశిత శిక్షణ గంటలను పూర్తి చేసి, 90 శాతం హాజరు, అవసరమైన పనితీరు ప్రమాణాలను పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.
ఐదేళ్ల పాటు అమల్లో ఎంఓయూ
మౌ
ఈ అవగాహన ఒప్పందం సంతకం చేసిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. తెలంగాణ యువతకు విమానయాన రంగంలో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ భాగస్వామ్యం రాష్ట్రంలో సాంకేతిక విద్య–పరిశ్రమ అనుసంధానానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.
.





