చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 :
స్వర మాధురి సాంస్కృతిక సేవా సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన వేదికలో "స్వర నృత్య వేడుక"ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరమాధురి సంస్థ అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గాయని గాయకులతో పాటు కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు "స్వర మాధురి - సమ్మైక్యత పురస్కారాలు" అందజేశారు. సభకు ముందు ప్రముఖ గాయని సాయి పవని నిర్వహణలో గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు త్రినాధరావు, యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ , ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.







