• డ్రైనేజీలను వెంటనే క్లియర్ చేయాలి..
• ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
• అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించాలి: సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19:
రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్ కమిషనరేట్ల ఉన్నతాధికారులతో వర్షాల నేపథ్యంలో చేపట్టిన ముందస్తు చర్యలు, సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలని, నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైనేజీలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. వర్షాల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే వేగంగా స్పందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సమాచారం ప్రకారం, భారీ వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, నాగర్కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వరకు ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు, ఫీల్డ్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.





