సికింద్రాబాద్ ట్రైన్ నైట్ న్యూస్సెప్టెంబర్:18/09/2026
నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడి పట్ల చిలకలగూడ పోలీసులు స్పందించిన తీరు స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న సదరు వృద్ధుడిని (60) గమనించిన చిలకలగూడ ఇన్స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ వెంటనే మానవతా దృక్పథంతో స్పందించారు. అతడికి అవసరమైన ప్రాథమిక వైద్య చికిత్సను అందజేసిన అనంతరం, యాప్రాల్ లోని ‘సెకండ్ ఛాయిస్ ఫౌండేషన్’ ప్రతినిధులను పిలిపించి వృద్ధుడిని సురక్షితంగా వారికి అప్పగించారు. వృద్ధుడికి ఆశ్రయం కల్పించి ఆదరించిన ఇన్స్పెక్టర్ రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ల మంచి మనసును గుర్తించిన స్థానిక ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.






