'నిలిచి గెలిస్తేనే ఘనత' పుస్తకావిష్కరణలో విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12 :
సమాజ సేవ చేసేవారు చాలా అరుదుగా ఉండే ప్రస్తుత కాలంలో, గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా సామాజిక సేవ చేయడం ఎంతో అభినందనీయమని బీసీ మేధావుల ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు కొనియాడారు. 'ఆరోగ్య మిత్ర' స్వచ్ఛంద సంస్థ రజతోత్సవాల సందర్భంగా శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో 'నిలిచి గెలిస్తేనే ఘనత' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి.చిరంజీవులు మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఆరోగ్యం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, మహిళా సాధికారతే లక్ష్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య మిత్ర సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని ఉత్తమ సేవలు అందించి, ప్రభుత్వ గుర్తింపుతో 'పద్మశ్రీ' పురస్కారం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇదే వేదికపై ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 42 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ, వారికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అశోక్ పరికిపండ్ల మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాబోయే రెండేళ్లపాటు 25 ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, 25 జిల్లాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా 25 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు 25 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
'బీసీ టైమ్స్' అధినేత సంఘం సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం, విశ్రాంత ఆర్డీవో వడ్డేపల్లి రామకృష్ణ, బీసీ నాయకులు కోల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.





