పాల సేకరణలో తాత్కాలిక తగ్గుదల..
పాడి రైతులకు ఎలాంటి బకాయిలు లేవు
నాణ్యమైన పాల ఉత్పత్తులు, మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి
డిమాండ్ కు సప్లై కు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిస్తాము
శాసనమండలి లో మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12 :
విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం శాసనమండలిలో విజయ డెయిరీ పాల సేకరణకు సంబంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. విజయ డెయిరీ పాల సేకరణలో తాత్కాలికంగా స్వల్ప తగ్గుదల నమోదైందని మంత్రి తెలిపారు. దీర్ఘకాలంగా కొనసాగిన లీన్ సీజన్ కారణంగానే ఈ తగ్గుదల ఏర్పడిందని వివరించారు.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో విజయ డెయిరీ రోజువారీ సగటు పాల సేకరణ వివరాలను మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 2023 – మార్చి 2024: రోజుకు 3.60 లక్షల లీటర్లు, ఏప్రిల్ 2024 – మార్చి 2025: రోజుకు 4.00 లక్షల లీటర్లు,
ఏప్రిల్ 2025 – మార్చి 2026: రోజుకు 3.36 లక్షల లీటర్లు అని తెలిపారు. పాడి రైతుల సంక్షేమం, విజయ డెయిరీ బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. పాడి రంగంలో రైతులకు మరింత భరోసా కల్పించడంతో పాటు విజయ డెయిరీని ఆధునికీకరించడం, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ను పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాడి రైతులకు చెల్లించాల్సిన పాల సేకరణ బకాయిలు ఏవీ లేవని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించి ప్రభుత్వం, విజయ డెయిరీ చెల్లింపుల విషయంలో ఎలాంటి బకాయిలు లేవని పేర్కొన్నారు.
తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతులకు దేశంలోనే అత్యధిక ధర చెల్లిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కృత్రిమ పన్నీరు ను నిషేదించిందని,విజయ డైరీ కేవలం పాలతో తయారు చేసే పన్నీరును విక్రయిస్తోందని తెలిపారు. విజయ డైరీకి ఆదాయం పెంచే విధంగా ఆయా స్థలాల్లో పెట్రోల్ బంక్ లు , షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. పశు వైద్య శాఖ లో 110 మంది డాక్టర్ లను 304 కాంపౌండర్లను నియమించామని వివరించారు.
రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి పాడి గేదెలను పంపిణీ చేసి పాల ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.డిమాండ్ కు సప్లై కి మధ్య వ్యత్యాసం తగ్గిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాడి రైతుల ప్రయోజనాలే ప్రజా ప్రభుత్వానికి ప్రాధాన్యత అని, విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.





