ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ :
అఖిల భారత విశ్వవిద్యాలయ ఉద్యోగుల సమాఖ్య (ఏఐయూఈసీ) ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్య-ప్రస్తుత స్థితిగతులు’ అనే అంశంపై 15వ జాతీయ మూడు రోజుల సదస్సు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. ఓయూ ఎన్జీవోల సంఘం, ఓయూ స్టాఫ్ అసోసియేషన్, ఓయూ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు, 1,000 మందికి పైగా భాగస్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల ఆధునీకరణ, విద్యా ప్రమాణాల పెంపు, ఉన్నత విద్యా సంస్కరణల సమర్థవంతమైన అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ దేశ నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమని, వర్సిటీ పాలన, అభివృద్ధిలో బోధనేతర సిబ్బంది, సేవా సంఘాలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. టీజీసిహెచ్ఈ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ మారుతున్న పాలనా, విద్యా విధానాలకు అనుగుణంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్ట్స్ అండ్ సామాజిక శాస్త్రాల కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కాశీం విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెంచాలని కోరారు. అకాడమిక్ ఆడిట్ డైరెక్టర్ ఆచార్య ఎన్. కిషన్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, సేవా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సెప్టెంబర్ 12 వరకు జరిగే సదస్సులో విద్యా విధానాలు, పాలనా సంస్కరణలు, పరిశోధన, సిబ్బంది సంక్షేమంపై పలు సాంకేతిక సదస్సులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఏఐయూఈసీ ప్రెసిడెంట్ బి.ఎస్. హోట, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.బి సజ్జన్, సెక్రెటరీ అంజన్ గోష్, మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు, కంతం ప్రేమ్ కుమార్, ప్రోగ్రాం కన్వీనర్ అబ్దుల్ ఖాదీర్ ఖాన్, కన్వీనర్ కె.ఎస్ నాగరాజ రావు, జనరల్ సెక్రెటరీ అక్బర్ బేగ్, జాయింట్ సెక్రెటరీ పి. పవన్ కుమార్, ట్రెజరర్ బి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.







