హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9:
తెలంగాణ గడ్డను, యాసను అమితంగా ప్రేమించిన ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషా వైతాళికుడని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు.
శ్రీ త్యాగరాయ గానసభలోని గుండవరపు హనుమంతరావు కళావేదికపై, గానసభ నిర్వహణలో ‘ఎందరో మహానుభావులు’ కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రజాకవి కాళోజీ నారాయణ రావు యాదిలో జయంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ... కాళోజీ మూలాలు మహారాష్ట్ర ప్రాంతమైనప్పటికీ, తెలంగాణ ఓరుగల్లు ప్రాంతంలో స్థిరపడి నాటి నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ఉద్యమశీలి అని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం కూడా తెలంగాణ ప్రజలపై జరుగుతున్న ఆధిపత్య పోరును నిరసిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా నిలిచి భాష, సంస్కృతి పరిరక్షణ కోసం పోరాడిన మహామనీషి అని కొనియాడారు. కాళోజీ భాషకు, సమాజానికి చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి కె.సి.ఆర్. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్వహిస్తూ వస్తోందని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అధ్యక్షత వహించిన ఈ వేదికపై యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ, ప్రముఖ గాయకుడు డాక్టర్ శంకర్ రామిరెడ్డి, గానసభ పాలకవర్గ సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








