హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్06
రిజర్వేషన్లు, రోస్టర్ విధానంలో మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు జరుగుతున్న నష్టాలను పరిష్కరించి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ మొదటి వారంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి మహాసభ నిర్వహించనున్నట్లు మాల స్టూడెంట్ జేఏసీ, అంసా, ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇటీవల వెలువడిన 25 ఉద్యోగ నోటిఫికేషన్లను పరిశీలిస్తే రోస్టర్ విధానం వల్ల మాల వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతినిధులు ఆరోపించారు. ఇందులో సుమారు 19 నోటిఫికేషన్లలో ఒక్క పోస్టు కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా కొద్దిమంది విద్యార్థి నాయకులతో ప్రారంభమైన తమ పోరాటానికి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతు ఉందని నిర్వాహకులు తెలిపారు. ఉద్యమాన్ని అన్ని జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాలకు విస్తరించేందుకు రౌండ్టేబుల్ సమావేశాలు, సన్నాహక సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించాలని నిర్ణయించారు.
అక్టోబర్ మొదటి వారంలో ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ‘మాల విద్యార్థి నిరుద్యోగుల రణభేరి’ పేరుతో నిర్వహించే మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, మాల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్, వైస్ చైర్మన్ పండుగ భానుతేజ, మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు మద్దెల రాజు, బత్తుల రమేష్, దిలీప్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, అంసా గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు చిక్కుడు వెంకట్, ఏనపోతుల అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.





