* శాంతియుతంగా, సురక్షితంగా ఉత్సవాల నిర్వహణకు చర్యలు..
* నిమజ్జన మార్గాల్లో విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని ఆదేశాలు..
తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3: రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాలు, విగ్రహ నిమజ్జన ఊరేగింపులను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నాన్టీచింగ్ ఫంక్షనల్ హాల్లో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. డీసీపీ రక్షిత కె. మూర్తి, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోలీస్, జీహెచ్ఎంసీ, టీజీ ఎస్పిడిసిఎల్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బి, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, 108 అత్యవసర వైద్య సేవల శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పౌర సౌకర్యాలు, విద్యుత్ సరఫరా, బారికేడింగ్, రహదారి మరమ్మతులు, పారిశుద్ధ్యం, అగ్నిమాపక భద్రత, అత్యవసర వైద్యం, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా చర్చించారు. ప్రధాన నిమజ్జన మార్గాల్లో వాహనాలు, విగ్రహాల ఊరేగింపులకు ఆటంకం కలగకుండా వేలాడుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని జీహెచ్ఎంసి హార్టికల్చర్ విభాగాన్ని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేసి భద్రపరచాలని టీజీ ఎస్పిడిసిఎల్, ను డీసీపీ ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చాయి. ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు పోలీసులతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలకు సహకరించి గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా విజయవంతం చేయాలని డీసీపీ కోరారు.






