* ఓయూలో ఆదివాసీ విద్యార్థి ఫోరం కొవ్వొత్తుల ప్రదర్శన..
* రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్.
* నిందితుడు ఎండీ. సనావుల్లను ఎంకౌంటర్ చేయాలి...
తార్నాక, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31:
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి శిరీష మృతి ఘటనపై ఆదివాసీ విద్యార్థి ఫోరం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. శిరీష మృతి ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారెవరైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. తీవ్ర విషాదంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. శిరీష మృతికి కారణమని ఆరోపిస్తున్న బైక్ మెకానిక్ ఎండీ. సనావుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఫోరం నేతలు హెచ్చరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఇతర ఘటనల్లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లను ప్రస్తావించారు. సనావుల్లను ను తక్షణమే పోలీసులు ఎంకౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆప్కా నాగేశ్వరరావు, కొండ నాగేశ్వరరావు, బాలు నాయక్, ప్రొఫెసర్ కాశీమ్, ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మడావి అజయ్, గౌతమ్, శివగణేష్, రాజశేఖర్, బండి శేకర్, భావన, శిరీష, కె.వినోద్, అజయ్, సొందే అన్సార్ తదితరులు పాల్గొన్నారు.





