హైద్రాబాద్,చిక్కడపల్లి ట్రై నెట్ న్యూస్ ఆగస్టు 18 :
తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత వెంకట్ నాగం ఒక అద్భుతమైన సాహితీమూర్తి అని ప్రముఖ రచయిత, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనోక్ అన్నారు. మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ , తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో రచయిత వెంకట్ నాగం రచించిన "రచ్చబండ చర్చలు" , "కలగూర గంప" పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం గానసభ అధ్యక్షుడు కళావిఎస్ జనార్దనముర్తి అధ్యక్షతన జరిగింది. ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ కాలం రచయితగా, నిక్కచ్చిగా వ్యాసాలు రాసే నిఖార్సయిన విశ్లేషకుడిగా ఆయన సమాజానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. వెంకట్ నాగం రాసిన ప్రతి వ్యాసం ఎంతో తృప్తిగా, ఆనందంగా, అంకితభావంతో రాసినట్లుగా స్పష్టమవుతుందని తెలిపారు. కళలు, సాహిత్యం, సమాజ పోకడలపై ఆయన చూపిన నిక్కచ్చితనం, సత్యసంధత పాఠకులను ఆలోజింపజేస్తాయని వివరించారు. సభను ప్రారంభించిన తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ మాతృభాషలో సమాజానికి ఉపయోగపడే అనేక అంశాలపై పుస్తకాలను తీసుకురావడం శుభపరిణామమని ఆయన అన్నారు. రోజురోజుకూ విధ్వంసమవుతున్న సామాజిక విలువలను పరిరక్షించుకోవడానికి, తెలుగు భాషా వికాసానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. మాతృభాషను కాపాడుకుంటూ, తదుపరి తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వంశీ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొన్నారు. రచయిత వెంకట్ నాగం మాట్లాడుతూ తన పుస్తకాల వెనుక ఉన్న భావజాలాన్ని, రచనలోని అనుభవాలను సభతో పంచుకున్నారు. కాగా కలగూర గంప గ్రంథాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ కు రచయిత వెంకట్ అంకితమిచ్చారు. సభా కార్యక్రమానికి ముందు సంయుక్త చే సంగీత విభావరీ, అనంతరం నిప్పాని వెంకట రత్నమాల చే సంగీత నృత్య కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.










