తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: ప్రజా ప్రభుత్వంలో మహలక్ష్మీ పథకం, నూతన రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందించడం మొదలగు ప్రభుత్వ, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు. గురువారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో సెప్టెంబర్, 17వ తేదీ పురస్కరించుకుని జాతీయ జెండాను చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి హైదరాబాద్ కు చెందిన ప్రజా సంఘాలు ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి నైజాం నిరంకుశ పాలనపై ప్రజలు తిరగబడ్డారు. హైదరాబాద్ విలీన చరిత్రలో రజాకార్ల భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటాలను ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వంతో చర్చలతో పరిష్కారం కాకపోవడంతో సెప్టెంబర్ 13వ తేదీన ఆపరేషన్ పోలో ప్రారంభించి భారత సైన్యం మూడు వైపులా హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనితో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆ విధంగా సెప్టెంబర్, 17వ తేదీకి చారిత్రక ప్రాధాన్యత వచ్చిందని అన్నారు. భారత దేశానికి 1947 ఆగష్టు, 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్, 17వ తేదీన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రస్థానంలో అనేక మంది పాల్గొని తమ త్యాగాలు, పోరాటాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న పతాకావిష్కరణ కార్యక్రమం అని ఆయన తెలిపారు. కొన్ని రాజకీయ శక్తులు దీనిని మత విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా వాడుకుంటున్నారని, కానీ ఇది నైజాం నిరంకుశ పాలన నుండి మనకు విముక్తి వచ్చిన దినంగా గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ విముక్తి పొరాటంలో అందరితోపాటు అనేక ముస్లీం కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని సెప్టెంబర్, 17వ తేదీన నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. అదే విధంగా రాబోయే కాలంలో హైదరాబాద్ అభివృద్దిలో భాగంగా ఫ్యూచర్ సిటీ పేరుతో అనేక పరిశ్రమల స్థాపన, అర్బన్ డెవెలప్ మెంట్, క్రీడా రంగం, ఫార్మా రంగం, ఐ.టి. వంటి అనేక సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





