* అండర్-19 కళాశాలల 70వ క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే..
* చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని విద్యార్థులకు పిలుపు..
కంటోన్మెంట్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31
: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో నిర్వహిస్తున్న అండర్-19 కళాశాలల 70వ క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ.. 16 నుంచి 19 ఏళ్ల వయసు యువతకు ఎంతో కీలకమని, ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడలు ఏకాగ్రతను పెంచి చదువులోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడా పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగేందుకు గొప్ప వేదికగా నిలుస్తాయని అన్నారు. క్రీడా సర్టిఫికెట్లు ఉన్నత విద్య ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాకు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతోందన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ యువత, క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించడంతో పాటు మైదానాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కళాశాలలకు, కంటోన్మెంట్ నియోజకవర్గానికి, హైదరాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.






