-సదస్సుకు అవసరమైనఏర్పాట్లు చేసిన వ్యవసాయ శాఖ
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
సెప్టెంబర్ 17: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (DA&FW) అధ్వర్యం లో దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల సదస్సు శుక్రవారం నాడు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (DA&FW) ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 10.40 గంటలకు ప్రారంభమయ్యే సమీక్షా సమావేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (DAM), రైతు రిజిస్ట్రీ, ఎరువుల యాప్ (FFS) పురోగతిని కేంద్ర అదనపు కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ కుమార్ మెహెర్దా సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం రైతు కేంద్రీకృత విస్తరణ వ్యవస్థ అయిన రైతు నేస్తం కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజంటేషన్ ఇవ్వనుండగా, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ అందించనుంది. సుగంధ ద్రవ్యాలు, జీడిమామిడి, కోకో, కొబ్బరి, ఉద్యానవన రంగాల పురోగతిపై చర్చతో పాటు, పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF), జాతీయ వంటనూనెల మిషన్ - ఆయిల్ పామ్ (NMEO-OP) పురోగతిపై సమీక్ష జరుగనుంది. నకిలీ పురుగుమందులు, ఎరువుల నియంత్రణ, ఎరువుల బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అరికట్టడం వంటి అంశాలపై కూడా విస్తృత చర్చ చేపడతారు. ఉత్తమ విధానాల ప్రదర్శనలో భాగంగా పప్పుధాన్యాల ఉత్పత్తి విధానాలపై కర్ణాటక, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ-మార్కెటింగ్పై కేరళ, ఆధునిక ఖచ్చిత వ్యవసాయం-హైటెక్ వ్యవసాయంపై తమిళనాడు రాష్ట్రాలు తమ అనుభవాలను వివరించనున్నాయి. మధ్యాహ్నం 2.15 గంటల నుండి ముగింపు సమావేశం జరుగనుంది. ఇందులో , ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీ లాల్ జాట్, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అతిష్ చంద్ర చర్చల సారాంశాన్ని వెల్లడించనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రులు ప్రసంగించనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు రామ్నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరి కూడా సభను ఉద్దేశించి మాట్లాడనున్నారని పేర్కొన్నారు.





