రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 17 : ప్రముఖ నాట్యగురువులు పద్మిని రాధాకృష్ణన్, ఆరతి జూతాని ల
శిష్యురాలు శ్లోక గద్దె భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన “సౌందర్య నాట్య కళాలయ ఫౌండేషన్” ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ఎస్ఎల్బీ కూచిపూడి కళానిలయం డైరెక్టర్ డా. వినీల రావు, పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కల్పన, బుచ్చయ్య దంపతుల కుమార్తె కుమారి శ్లోక గద్దె భరతనాట్యంలో విశేష సాధన చేసి భరతనాట్య రంగ ప్రవేశం చేయడం అభినందనీయమన్నారు. శ్లోక గద్దె సౌందర్య నాట్యకళాలయ ఫౌండేషన్లో 15 ఏళ్ల భరతనాట్యం శిక్షణ పొందింది. ఆమె ఎనిమిదేళ్ల వయసులో బ్యాంకాక్లో తన గురువు ఆరతి జుతాని మార్గదర్శకత్వంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందన్నారు . 2020లో ఆమె కుటుంబం కంబోడియాకు వెళ్లిన తర్వాత, ఆమె అద్భుతమైన అంకితభావంతో, పట్టుదలతో ఆన్లైన్లో తన శిక్షణను కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి అభ్యసిస్తోందని తెలిపారు. భరతనాట్యంతో పాటు పియానో వాయించడం, వివిధ క్రీడలలో రాణిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్లోక గద్దె ప్రదర్శించిన పుష్పాంజలి, భాగ్యదలక్ష్మి, వర్ణం, భో శంభో, తీగట్టుం వారై, థిల్లానా, భ్రమమోకటే అంశాలపై ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.






