రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నాద అమిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే పురస్కారించుకుని రవీంద్ర భారతి లోని ఆడిటోరియంలో “కరావుకే” పేరిట నిర్వహించిన సంగీత విభావరి వీక్షకులను అలరించింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత కర్ణాటక సంగీత మహా విద్వాన్ ఆకెళ్ల మల్లికార్జున శర్మ, ప్రముఖ గిటారిస్ట్, సంగీత దర్శకుడు సాలూరి వాసు రావులకు జీవితకాల సాఫల్య పురస్కారాలతో పాటు అశ్విని హోమియోపతి చైర్మన్ అశ్విని సుబ్బారావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, లైన్స్ క్లబ్ వ్యవస్థాపకులు సౌజన్య చౌదరీ, మాజీ డీజీపీ ఎస్కే జయచంద్రలకు విశిష్ట సీనియర్ సిటిజన్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
ప్రముఖ సంగీత విద్వాంసుడు విద్వాన్ జొన్నలగడ్డ శ్రీరామ్ బృందంచే నామసంకీర్తనలతో పాటు స్వాతి సోమనాథ్ విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పురస్కార గ్రహీత అశ్విని సుబ్బారావు మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్ల వారి సేవలు గుర్తించి ఇలాంటి పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ ఫౌండేషన్ కు తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాద అమీల్ ఫౌండేషన్ ఫౌండర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.






