నలుగురు విద్యార్థులకు సొంత ఖర్చులతో సైకిళ్ల పంపిణీ
"ప్రతి ఏటా ఉచితంగా సైకిళ్లు అందిస్తా" - సర్పంచ్ సరికొత్త హామీ
ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అరుదైన చొరవ
సూర్యాపేట, పెన్ పహాడ్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9:
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్థానిక సర్పంచ్ నాతాల వెంకట్రెడ్డి అరుదైన ఉదారతను చాటుకున్నారు. మండల పరిధిలోని గాజుల మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాఠశాలలో చదవడానికి ప్రతిరోజూ సుమారు 7 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న నలుగురు పేద విద్యార్థులను సర్పంచ్ గుర్తించారు. రవాణా కష్టాల వల్ల విద్యార్థులు బడికి దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఒక్కొక్కటి రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 24,000 విలువైన నాలుగు సైకిళ్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాతాల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దూర భారం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఈ చిన్న సహాయం చేశానని తెలిపారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా దూరం నుండి వచ్చే పేద విద్యార్థులను గుర్తించి, వారికి సొంత ఖర్చులతో సైకిళ్లను పంపిణీ చేస్తానని ఈ వేదికగా ఆయన సంచలన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. హెచ్ఎం చేకూరి అంజయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల కష్టాన్ని గుర్తించి సకాలంలో స్పందించిన సర్పంచ్ చొరవ అందరికీ స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య, డాక్టర్ కవిత, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మంజుల, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీరాములు, విద్యార్థుల తల్లిదండ్రులు భూక్య వెంకటేశ్వర్లు, గుగులోతు సురేష్, వెంకన్న, నిర్మల, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.





