హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 4:
శ్రీకృష్ణాష్టమి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని KVK Fine Arts & Melodies (Cultural Organisation) ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, నృత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ఉపాధ్యాయులను గౌరవిస్తూ ‘సద్గురు పురస్కారోత్సవం’ నిర్వహించారు, శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్పీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకకు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా గరుడవేగ ఇంటర్నేషనల్ కొరియర్–నెక్స్జెన్ లాజిస్టిక్స్ సీఈఓ లక్కవరపు సతీష్, సీఎఫ్ఓ శ్రీనాథ్ రెడ్డి పాల్గొనారు. కళాపత్రిక చీఫ్ ఎడిటర్ డా. ఎస్.కె. మహమ్మద్ రఫీ అధ్యక్షత వహించగా, ప్రముఖ గాయకుడు, కెనరా బ్యాంక్ రిటైర్డ్ డీఎం యల్లాప్రగడ అమరేశ్వరరావు పాలుపంచుకున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బి.వి.ఎస్.ఆర్.ఎస్. శర్మ, డా. అన్నదానం వి. సుబ్రహ్మణ్యం, రమా బండారు, శిష్ట్ల మంజుల తదితరులను ప్రత్యేకంగా సత్కరించారు. ప్రత్యేక ఆహ్వానితులు, సలహాదారులుగా డా. వంశీ రామరాజు, చెబ్రోలు శశిబాల, మహమ్మద్ షబ్బుద్దీన్ హాజరయ్యారు.
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, నృత్య గురువు పి. జ్వాలాముఖి దేవి పర్యవేక్షణలో శ్రీకృష్ణ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కేవీకే ఫైన్ ఆర్ట్స్ అండ్ మెలోడీస్ అధ్యక్షుడు కుప్ప వెంకట కృష్ణమోహన్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళాభిమానులు, సంగీత–నృత్య ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగింపు పలికారు.








