హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10:
జీహెచ్ఏంసీ లో ఉద్యోగులు, కార్మికులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, కాంట్రాక్టర్లకు అభివృద్ధి. మెయింటెనెన్స్ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. అనవసర ఖర్చులను కంట్రోల్ చేయడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలోకి డిప్యుటేషన్లపై వచ్చే అధికారులకు కోట్లాది రూపాయలు వెచ్చించి, కార్పొరేట్ స్థాయిలో ఛాంబర్లను ఏర్పాటు చేయడం విమర్శలకు
దారితీస్తోంది. బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగంలో దశాబ్దాలుగా తిష్ట వేసిన ఓ ఇంజినీర్ తరుచూ ప్రతిపాదనలు తయారు చేస్తున్నా, ఉన్నతాధికారులు ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సమయంలో గుడ్డిగా మంజూరీలిస్తున్నట్లు సమాచారం. పనులు కూడా సదరు ఇంజినీర్ బినామీలే చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రకంగా ప్రతి ఏటా సుమారు రూ.10 కోట్ల వరకు రెనోవేషన్ పేరిట ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ వ్యయభారం అవసరమా అని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది పొడువునా ప్రధాన కార్యాలయం లో ఎక్కడో ఓ చోట రెనోవేషన్ పనులను మంజూరు చేయించుకుంటూ పనులు కొనసాగిస్తున్న ఓ ఇంజినీర్ కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా నాలుగేళ్ల పాటు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించే వివిధ విభాగాధిపతులు, అదనపు కమిషనర్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి, అధికారులకు నచ్చిన విధంగా చాంబర్ల రెనోవేషన్ పనులను కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మూడో అంతస్తులోని ఇద్దరు అదనపు కమిషనర్ల ఛాంబర్లను రెనోవేట్ చేసిన అధికారులు.. ఇప్పుడు రెండో అంతస్తులోని ఫైనాన్షియల్ అడ్వైజర్ ఛాంబర్ను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఛాంబర్ల రెనోవేషన్ పనులు పూర్తయ్యే దశలో అధికారుల వాస్తు సెంటిమెంట్లో అదనంగా మరిన్ని పనులు కూడా చేపట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఛాంబర్ను బిల్లుల కోసం కాంట్రాక్టర్లు మినహా ఉన్నతాధికారులు గానీ, సందర్శకులు గానీ ఎవరూ పెద్దగా సందర్శించరు. సందర్శకులు ఎక్కువగా రాకపోకలు సాగించే చీఫ్ మెడికల్ ఆఫీసర్, అదనపు కమిషనర్ (శానిటేషన్), 6వ అంతస్తులోని మెయింటెనెన్స్, ప్రాజెక్టుల విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ల ఛాంబర్లు దశాబ్దాలుగా అరకొర వసతుల మధ్యనే కొనసాగుతున్నాయి. 5వ అంతస్తులోని చీఫ్ ఇంజినీర్ ఆఫీస్ కార్పొరేట్ లుక్ ఉండగా, 6వ అంతస్తులోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏ ఛాంబర్ను కూడా ఇప్పటి వరకు రినోవేట్
చేయకపోవడంతో పాత లుక్ నే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏ యూనియన్ కూడా గుర్తింపు చెల్లుబాటు లో లేకపోయినా, యూనియన్లు అడగడమే ఆలస్యం యూనియన్ల ఆఫీస్ రెనోవేషన్కు కూడా అధికారులు మంజూరీలివ్వడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్లో రెనోవేషన్ పనులు చేపట్టిన కొద్ది నెలలకే వర్షపు నీరు లీకేజీ అయ్యేలా నాసిరకం పనులు చేపట్టిన సదరు ఇంజినీర్ రూపకల్పన చేసిన ప్రతి ప్రతిపాదనకు అధికారులు గుడ్డిగా మంజూరీ ఇవ్వడం వెనకా అసలు ఆంతర్యమేంటన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు మూడు, నాలుగు, రెండో అంతస్తుల్లో రెనొవేట్ చేసిన ఛాంబర్లు అప్పట్లో అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహించిన క్యాడర్, నాన్ క్యాడర్ ఆఫీ సర్లకు ఛాంబర్ల రెనొవేషన్ కలిసి రాలేదు. అదనపు కమిషనర్గా విధులు నిర్వహించిన అనురాగ్ జయంతి ఛాంబర్ నాలుగో అంత స్తులో ఉండేది. కార్పొరేట్ స్థాయిలో ఆయన ఛాంబర్ను రెనోవేట్ చేయగానే ఆయనకు జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయింది. అలాగే గతంలో మూడో అంతస్తులోని అదనపు కమిషనర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వర్తించిన గీ తారాధిక ఛాంబర్ను కూడా రెనోవేట్ చేసిన వెంటనే ఆమెను మరో విభాగానికి బదిలీ అయ్యారు. కొన్ని రోజులు ఏ విభాగాన్ని కే టాయించకుండా పక్కన బెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ విభజించక ముందు ఇదే మూడో అంతస్తులోని అదనపు కమిషనర్ ఛాంబర్ను వినియోగించిన, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సృజన కూడా కొద్ది రోజులు మాత్రమే ఈ చాంబర్ లోవిధులు నిర్వర్తించి, ఫిబ్రవరి 11 నుంచి సైబరాబాద్ కమిషనర్ గా నియమితులయ్యారు.
స్క్రాప్ను కూడా వదలరా?
పొడువునా జరిగే ఛాంబర్ల రెనోవేషన్తో ఖరీదైన ఫర్నిచర్ , కంప్యూటర్లు, ఇతర సామాగ్రి స్క్రాప్ మారుతున్నది. నిబంధనల ప్రకారం ఈ స్క్రాప్కు టెండర్ల ప్రక్రియ చేపట్టి, డిస్పోజ్ చేయాల్సి ఉండగా, మెయింటెనెన్స్ విభాగం అధికారులు ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టకుండా గడిచిన కొద్ది రోజుల నుంచి స్క్రాప్ను తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్క్రాప్ తరలింపునకు సంబంధించి మెయింటెనెన్స్ విభాగానికి చెందిన ఓ ఇంజినీర్ను ప్రశ్నించగా, అంతా రూల్స్ ప్రకారమే జరుగుతున్నదని, టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టామని సమాధానమిస్తున్నారు. కానీ, అందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు గానీ, డాక్యుమెంట్లను గానీ సమర్పించడం లేదు. దాదాపు నెల రోజుల నుంచి సదరు ఇంజినీర్ అంతా రూల్స్ ప్రకారమే జరుగుతుందంటూ సమాధానం చెబుతూ దాటవేయడం గమనార్హం.





