ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8 :
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో దాసి ప్రాన్షుత రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మంగళవారం నిర్వహించిన ఓయూ 85వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్, ఓయూ చాన్స్ లర్ చేతుల మీదుగా ఆమె స్వర్ణ పతకాలు, అవార్డులను అందుకున్నారు. ఈ ఘనతతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన ప్రాన్షుత ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లో జన్మించారు. బెంగళూరు, వరంగల్ లోని కేంద్రీయ విద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఆమె పదో తరగతి, ఇంటర్మీడియట్ లో టాపర్గా నిలిచారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం (బిఏఎంయూ) లో గ్రాడ్యుయేషన్ లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ప్రాన్షుత మాజీ భారత వైమానిక దళ అధికారి దాసి ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన దంపతుల కుమార్తె. దాసి ప్రభాకర్ భారత వైమానిక దళంలో సేవలందించడంతో పాటు కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పతకం అందుకున్నారు. తమ కుమార్తె రెండు స్వర్ణ పతకాలు సాధించడం కుటుంబానికి ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు తెలిపారు. ప్రాన్షుత సాధించిన విజయం క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు.





