ప్రజావాణి పోర్టల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు..
ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్....
సూర్యాపేట, ట్రైనెట్ న్యూస్ , ఆగస్టు 31: ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ప్రతి అధికారి తమ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని లేనియెడల వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 36 దరఖాస్తులు, డి పి ఓ 7, మున్సిపాలిటీ 5 , డిఎంహెచ్వో 3, మిగిలిన 19 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 70 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, సిపిఓ కిషన్, డిఏఓ శ్రీధర్ రెడ్డి, డిఎంహెచ్వో వెంకటరమణ, డిపిఓ యాదగిరి, డిడబ్ల్యూఓ నరసింహారావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
------------------------------





