హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18:
రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యలో ప్రోత్సహించేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్ లో భాగంగా మెరిట్ స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన
సీఎస్ఆర్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు.
“యువ మేధస్సుకు ప్రోత్సాహం - ఉజ్వల భవిష్యత్తుకు బాట” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 750 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, గార్డియన్లు, ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డా. జి. ముకుంద్ రెడ్డి, ఐఏఎస్, రక్షిత కె. కృష్ణమూర్తి, ఐపీఎస్ , కుమార్ మొలుగారం, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుదర్శన్ హొల్లా బాల్నాడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు విద్యలో ప్రతిభ కనబరచి ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మెరిట్ స్కాలర్షిప్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు అందిస్తున్న ప్రోత్సాహమని అన్నారు. “ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, అడ్వకేట్,, లీడర్ ఏది కావాలనుకున్నా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలి” అని మంత్రి సూచించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం సూచించినట్లుగా కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు. రవాణా రంగంలో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల కష్టానికి తగిన గౌరవం తీసుకురావాలని కోరారు. నేడు మీకు అందుతున్న స్కాలర్షిప్ను ఒక మెట్టుగా భావించి, రేపు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కష్టపడాలి. మీ విజయం మీ తల్లిదండ్రుల కష్టానికి నిజమైన గౌరవం” అని మంత్రి అన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
రవాణా శాఖ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై కూడా మంత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క చిన్న అజాగ్రత్త, నిర్లక్ష్యం కుటుంబాలను విషాదంలోకి నెట్టే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు.
“వాహనం నడిపేటప్పుడు మన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి” అని మంత్రి అన్నారు.
రోడ్ సేఫ్టీపై ప్రమాణం
ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలతో కలిసి మంత్రి రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. “జాగ్రత్తగా నడుద్దాం.. సురక్షితంగా ప్రయాణిద్దాం.. మన ప్రాణాలను, ఎదుటివారి ప్రాణాలను కాపాడుదాం” అని మంత్రి పిలుపునిచ్చారు.





