సానుకూలంగా స్పందించిన ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్
తెలంగాణ బియ్యం ఎగుమతుల విస్తరణకు సానుకూల స్పందన
మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాల కొనుగోలుపైనా ఆసక్తి
అంతర్జాతీయ విపణిలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత అవకాశాలు
న్యూ ఢిల్లీ , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 9:
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక “తెలంగాణ రైజింగ్ సమ్మిట్” కు హాజరుకావాల్సిందిగా ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్ జూనియర్ను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉదయం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ఉత్పాదక సామర్థ్యం, ఎగుమతి అవకాశాలను ఆయనకు వివరించడంతోపాటు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లక్ష్యాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను భారీగా పెంచడం, ఇరు ప్రాంతాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడం, దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ నుంచి పెద్ద పరిమాణంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన మాంస ఉత్పత్తులు, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విత్తనాల కొనుగోలుపైనా ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్ జూనియర్ ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, విస్తారమైన ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యతతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించగలవని ఆయన పేర్కొన్నారు. “తెలంగాణ రైతు పండించిన ధాన్యానికి అంతర్జాతీయ మార్కెట్ ద్వారాలు తెరవడమే మా ప్రభుత్వ లక్ష్యం. బియ్యం ఎగుమతులు విస్తరించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతోపాటు రైస్మిల్లర్లు, విత్తన కంపెనీలు, మాంస ఉత్పత్తిదారులు, ఆహారశుద్ధి పరిశ్రమలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా ప్రపంచ మార్కెట్తో అనుసంధానమైన లాభసాటి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలకు అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, ఆహారశుద్ధి, విత్తనోత్పత్తి, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ–ఫిలిప్పీన్స్ మధ్య నూతన భాగస్వామ్యానికి ఈ సమ్మిట్ బలమైన పునాది వేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.





