19 RVB 1
*రూ.11 కోట్ల బకాయిల పరిష్కారానికి అత్యవసర చర్యలు
అధికారులకు తక్షణ ఆదేశాలు
రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 19,
తెలంగాణ రాష్ట్రంలోని జానపద కళాకారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కళాకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. జానపద కళాకారుల ఐక్యవేదిక ప్రతినిధులు బుధవారం మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని సమర్పించారు. 2023 నుంచి 2026 మధ్య ప్రభుత్వం, భాషా–సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పండుగలు, ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో రాష్ట్రంలోని జానపద కళాకారులు, కళాబృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన పారితోషికాలు, ప్రయాణ ఖర్చులు, ఇతర చెల్లింపులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని మంత్రికి వివరించారు. కార్యక్రమాలు పూర్తయిన తరువాత బిల్లులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటంతో కళాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కళాకారులు సమర్పించిన వివరాల ప్రకారం సుమారు రూ.11 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించి అర్హత కలిగిన కళాకారులు, కళాబృందాలకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
మంత్రి సానుకూలంగా స్పందిస్తూ..
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంపై ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం భాషా–సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డితో మంత్రి మాట్లాడి పెండింగ్ బిల్లుల అంశంపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లులకు సంబంధించిన వివరాలను పూర్తిగా పరిశీలించి, అర్హతను నిర్ధారించి, చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ఎండోమెంట్ శాఖ నుంచి రావాల్సిన నిధులను సమన్వయం చేసి కళాకారుల బకాయిల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. జానపద కళాకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు, ఐడీ కార్డులు, వివిధ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కళారంగానికి విశేష సేవలందించిన వారిని గుర్తించి అవార్డు గ్రహీతలను సన్మానించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. జానపద కళలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని కళాకారుల ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ కళారూపాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. కార్యక్రమంలో జానపద కళాకారుల ఐక్యవేదిక ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్ కుమార్, ఒగ్గు రవి, సోమరాజు శ్రీనివాస్, హిమగిరి, కృపాదానం, ఎస్. గణేష్, మురళీకృష్ణ, రాజకుమార్, ఒగ్గు ధర్మయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





