కష్టాలను దాటి.. డాక్టరేట్ సాధించిన ఆంజనేయులు
నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
హాలియా: హాలియా ప్రాంతానికి చెందిన విద్యావేత్త, శ్రీ శ్లోకా స్కూల్స్ చైర్మన్ కుకుడాల ఆంజనేయులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకుని అరుదైన ఘనత సాధించారు.
హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ఆంజనేయులు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి కుమార్ ములుగారం తదితరులు పాల్గొన్నారు.
వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధన పూర్తి చేసినందుకు ఆంజనేయులకు ఈ డాక్టరేట్ లభించింది. ఈ ఘనత పట్ల ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
హాలియా ప్రాంతానికి చెందిన ఆంజనేయులు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. పట్టుదల, కృషి, విద్యపై ఉన్న ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రస్తుతం శ్రీ శ్లోకా స్కూల్స్ చైర్మన్గా విద్యారంగంలో సేవలందిస్తున్నారు.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించే స్థాయికి చేరుకోవడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక పరిమితులు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆంజనేయుల విజయగాథ నిరూపిస్తోందన్నారు.
డాక్టరేట్ సాధించిన కుకుడాల ఆంజనేయులను పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.





