* అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం..
ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కెంట్ మధ్య విద్యా, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను అన్వేషిస్తూ శుక్రవారం సమావేశం జరిగింది. కెంట్ బిజినెస్ స్కూల్ (కేబిఎస్) డీన్ ప్రొఫెసర్ విక్కీ నైట్, ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, ఇరు విశ్వవిద్యాలయాల స్థాయిలో విస్తృత సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇరు సంస్థల మధ్య అధ్యాపకుల పరస్పర అనుసంధానం (ఫ్యాకల్టీ మ్యాచింగ్) చేపట్టడం ద్వారా అర్థవంతమైన విద్యా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలని వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆకాంక్షించారు. ప్రతిపాదిత సహకారాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ టు వీసీ ప్రొఫెసర్ ఎస్. జితేందర్ కుమార్ నాయక్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ వి. జహంగీర్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ డీన్ ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్, రూసా నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీనివాసులు సి. తదితరులు పాల్గొన్నారు.





