హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 31:
భారతీయ శాస్త్రీయ నృత్య రీతులలో విశిష్టతను తెలియజెప్పేందుకు, పరిశోధనా అంశాల ఎంపికపై, పత్ర రచనా పద్ధతి తదితర విషయాలపై అవగాహనను పెంపొందించేందుకు "జిజ్ఞాస" పేరిట ఒక నృత్య కార్యశాలను సెప్టెంబర్ 6, ఆదివారం నిర్వహించనున్నట్టు నవ్య నాటక సమితి అధ్యక్షుడు వేమరాజు విజయకుమార్, సమన్వయకర్తలు నిష్టల సుధామాల, మధుమతి కులకర్ణి పత్రికా విలేకరులకు సమితి కార్యాలయంలో తెలిపారు.
శ్రీ కృష్ణ దేవరాయ తెలుగు భాషానిలయంలో జరిగే ఈ కార్యశాలలో నాట్య ప్రక్రియలపై పరిశోధనా విధానంలో ప్రామాణిక వ్యాసరచనా పద్ధతిపై ప్రముఖ నృత్య గురువు, అమెరికాలోని అరియ విశ్వవిద్యాలయం ఆచార్య వేలూరి సుమిత్ర సూచనలు చేస్తారని సుధామాల తెలిపారు.
కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రిక ను సోమవారం నవ్య నాటక సమితి కార్యాలయం లో రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ ఉప సంచాలకులు జి.వసుంధర సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ .. నృత్య రంగంలో ప్రామాణిక పత్ర రచన చేయాలనుకునే విశ్వ విద్యాలయ పరిశోధక విద్యార్థులకు, నృత్య కళాకారులకు ఈ కార్యశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
భారతీయ శాస్త్రీయ నృత్య, సంగీత రంగాలలో కార్యశాలలను, ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్న నవ్య నాటక సమితి కార్యనిర్వాహక సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో
సమితి సభ్యులు డా. ఇందిరా హేమ, వేమరాజు రమాదేవి పాల్గొన్నారు.





