ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ పరిరక్షణ కోసం పోరాటం
బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం సహించం
- ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ అనిల్ కుమార్ వెల్లంకి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 9:
దీర్ఘకాలికంగా పెండింగ్ లోఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ అనిల్ కుమార్ వెల్లంకి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి, సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించకపోతే, సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మూడు రోజులపాటు మళ్లీ తదుపరి దేశవ్యాప్త సమ్మె జరిపి తీరుతామని హెచ్చరించారు. హైదరాబాద్ , బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి పి. మురళి, ఏపీ అండ్ తెలంగాణ అధ్యక్షులు ఐ. హరనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్. సుబ్రహ్మణ్యం తో లసి అనిల్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకు పనితీరు, వ్యాపారం మరియు లాభాలు ఏ ఒక్క అధికారి లేదా ఎగ్జిక్యూటివ్ కృషి వల్ల మాత్రమే సాధ్యం కావని, సబ్స్టాఫ్, క్లరికల్ సిబ్బంది, అధికారులు, సీనియర్ అధికారులు ఎగ్జిక్యూటివ్లు అందరి సమిష్టి కృషి ఫలితంగానే నేడు బ్యాంకింగ్ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుందని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులను లాభాల్లో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ లు వివక్ష చూపుతూ ప్రభుత్వరంగ బ్యాంకులను డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ప్రైవేటు పరం చేసి ప్రజల సొమ్ము లూటీకి మార్గం చూపుతుందని మండిపడ్డారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చల సందర్భంగా కార్మిక సంఘాల మధ్య కుదిరిన అవగాహన ఉన్నప్పటికీ ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్దంగా లాభాల్లో నడుస్తున్న ఐడీబీఐ
బ్యాంకు ను డిజిన్వెస్ట్మెంట్ చేసి ప్రభుత్వ యాజమాన్యాన్ని గణనీయంగా తగ్గించి, ప్రైవేట్, విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించే ప్రతిపాదన దుర్మార్గమన్నారు. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల ప్రధాన డిమాండ్లు అందరికీ సమానమైన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అమలు, ఐదు రోజుల బ్యాంకింగ్ వారం, ఐడీబీఐ
బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ లేనిపక్షం దేశవ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేస్తామని అనిల్ కుమార్ వెల్లంకి హెచ్చరించారు.





