హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ట్రైనెట్ న్యూస్):
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ జయంతులను పురస్కరించుకుని స్వరమధురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “స్వరమధురి 191వ సంగీత విభావరి” కార్యక్రమాన్ని శనివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.
సినీ సంగీత రంగానికి అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి అందించిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలను గాయకులు ఆలపించి సంగీతాభిమానులను అలరించారు. అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన పలువురు కథానాయికలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సినీ విజ్ఞాన విశారద, కళారత్న ఎస్.వి. రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వరమధురి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. కె.వి. జయకుమార్, కార్యదర్శి సునీల్ ప్రభాకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సంగీత విభావరిలో పలువురు గాయకులు, కళాకారులు, సినీ సంగీతాభిమానులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి సినీరంగానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.






