హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్ 15:
శ్రీ చంద్ర కళా నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన “పన్నెండు వసంతాల కళాప్రస్థానం” కార్యక్రమంలో బాగంగా పేరణి , ఆంధ్ర నాట్య ప్రదర్శనలు రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని పేరిణి నాట్యం, ఆంధ్ర నాట్యంలోని వివిధ నృత్యాంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విద్యార్థులు కుంభాహారతి, పేరిణి పాత్ర ప్రవేశం, దశరథ రామ గోవింద, బ్రహ్మ గద్య, శివ కైవరం, సంధ్యా సమయము, శబ్ద పల్లవి, సాహిత్య పల్లవి తదితర నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. సంప్రదాయ నృత్యరీతులను, గురు-శిష్య పరంపరను ప్రతిబింబించేలా విద్యార్థుల ప్రదర్శనలు సాగాయి.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కంచర్ల శ్రీనివాస్ రావు హాజరై విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత పేరిణి రాజ్ కుమార్, ప్రముఖ సినీ గేయ రచయిత మల్లికవల్లభ , సురభి నాటక కళాకారుడు, మేకప్ ఆర్టిస్ట్ సురభి దినకర్ పాల్గొని విద్యార్థులందరికీ బహుమతులు అందజేసి అభినందించారు. శ్రీ చంద్ర కళా నిలయం ద్వారా గత పన్నెండు సంవత్సరాలుగా పేరిణి నాట్యం, ఆంధ్ర నాట్యం వంటి సంప్రదాయ నృత్యకళలను విద్యార్థులకు అందిస్తూ కళా, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని గురు సంతోష్ పెరుమాండ్ల, ప్రకాశ్ సమన్వయంతో నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొన్నారు.







