జాతీయ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
సంగీత విద్వాంసులు, కళాకారులకు ప్రత్యేక సన్మానాలు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18:
పద్మవిభూషణ్, సంగీత దిగ్గజం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి మహోత్సవాన్ని జాతీయ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన హాలులో సెప్టెంబర్ 18న సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
తెలుగు సంగీత ప్రపంచానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అందించిన అపూర్వ సేవలను ఈ సందర్భంగా స్మరించనున్నారు. శాస్త్రీయ సంగీతాన్ని తన వినూత్న గానశైలితో ప్రపంచవ్యాప్తంగా విశిష్ట స్థాయికి తీసుకెళ్లిన ఆయన సేవలను ప్రముఖులు కొనియాడనున్నారు.
ఈ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి. రమణాచారితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సంగీత విద్వాంసులు, కళాకారులు పాల్గొననున్నారు.
కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు, వాయిద్య కళాకారుల సంగీత ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సంగీత రంగానికి విశేష సేవలు అందిస్తున్న కళాకారులు, కళాభిమానులను సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జాతీయ సంగీత కళాకారుల సంఘం కళాకారుల సంక్షేమంతో పాటు భారతీయ సంగీత, సాంస్కృతిక సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సంగీత మహోత్సవానికి కళాకారులు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.







