హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
సెప్టెంబర్ 17: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఎల్ బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ ఏ. సోనీబాలా దేవి, ఐఎఫ్ఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా పలు కీలకమైన, క్రియాశీలక కార్యక్రమాలను అమలు చేస్తూ స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులకు మరింత చేరువవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభను వెలికితీయడం, యువతను క్రీడల వైపు ఆకర్షించడం, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సదుపాయాలు అందించడం లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆమె వివరించారు.
ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో నిలిచినట్టే క్రీడారంగంలోనూ దేశంలో అగ్రగామిగా ఎదగాల్సిన అవసరం ఉందని డాక్టర్ సోనీబాలా దేవి అన్నారు. ఈ లక్ష్య సాధనకు క్రీడా సమాజం మొత్తం చిత్తశుద్ధితో సమష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, కోచ్లు, సిబ్బంది, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





