-రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: ఎన్నికల అఫిడవిట్ లో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిపోయిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని మంత్రి విమర్శించారు. తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ కు ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాలు భూస్వామ్య కుటుంబంలో జన్మించారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ ను ఎక్స్ లో షేర్ చేస్తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్కు భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతుందన్నారు.
బొంకుతున్నా కేటీఆర్
బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలితే కేసీఆర్ కుటుంబానికి మాత్రం లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని మంత్రి నిలదీశారు. ఇదంతా ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా అని ప్రశ్నించారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద కల్వకుంట్ల కుటుంబంలక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకుంటే డ్రామారావు (కేటీఆర్) మాత్రం పుట్టుకతోనే కేసీఆర్కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలదీశారు.






