హైదరాబాద్, ఆగస్టు 31:
తార్నాక డివిజన్లోని పలు కాలనీల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ కార్పొరేటర్ అలకుంట సరస్వతిహరి ఆవేదన వ్యక్తం చేశారు.
తార్నాక డివిజన్లోని నాగార్జున నగర్ నుంచి అండాలు స్వీట్స్ మీదుగా నాచారం వెళ్లే మార్గాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రమాదాల భయం నెలకొంటోందని, పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గతంలో డివిజన్కు ప్రాతినిధ్యం వహించిన పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అంతర్గత రోడ్లు ఈ దుస్థితికి చేరుకున్నాయని ఆమె ఆరోపించారు. ప్రజలకు అత్యవసరమైన మౌలిక వసతులపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు.
నాగార్జున నగర్తో పాటు తార్నాక డివిజన్లోని అన్ని కాలనీల్లో అధ్వానంగా ఉన్న రోడ్లను జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించేందుకు అధికారులు ఇకనైనా స్పందించి రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అలకుంట సరస్వతిహరి కోరారు.





