రెండో విడతలో 59 వేల గుడిసెలకు ఇందిరమ్మ ఇళ్లు
ఏ నియోజకవర్గంలోని పేదలకు ఆ నియోజకవర్గంలోనే ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10:
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు మనోహరరెడ్డి, రాజగోపాల్రెడ్డి, మేడేపల్లి సత్యం, అక్బరుద్దీన్, వెంకట్రామిరెడ్డి తదితర సభ్యుల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పేదలను వారి జీవనోపాధికి దూరంగా 30–40 కిలోమీటర్ల అవతలికి పంపించే విధానం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎకరం రూ.150–200 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లో కూడా పేదవాడి ఆత్మగౌరవానికి తగినట్లుగా ఇల్లు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు.
డ్రాలో పారదర్శకత.. అనర్హులకు చోటు లేదు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని మంత్రి తెలిపారు. డ్రాలో ఎంపికైన ప్రతి లబ్ధిదారుడిని అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు డ్రాలో ఎంపికైనట్లు తేలితే వారి పేర్లను తప్పనిసరిగా తొలగిస్తామని సభ సాక్షిగా స్పష్టం చేశారు. రూ.5 లక్షలు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఉచితంగా అందించిన ఉదాహరణ లేదని, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. రూ.5 లక్షలు సరిపోవడం లేదని పలువురు సభ్యులు సూచించారని, ఆ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.
8 లక్షల ఇళ్లకు సుమారు రూ.40 వేల కోట్ల భారం
మొదటి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లకు సుమారు రూ.22,500 కోట్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లకు సుమారు రూ.11 వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లకు సుమారు రూ.5,500 కోట్లు అవసరమవుతాయని మంత్రి వివరించారు. రెండు విడతల్లోనే సుమారు 8 లక్షల ఇళ్లకు రూ.40 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన పేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
చిన్న లోపాలతో ఆగిన 3,200 ఇళ్లకు పరిష్కారం
మొదటి విడతలో ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు ప్రారంభించి, నిర్మాణంలో చిన్నచిన్న లోపాల కారణంగా నిలిచిపోయిన సుమారు 3,200 ఇళ్లను రాటిఫై చేసి క్లియర్ చేశామని మంత్రి తెలిపారు. వారందరికీ ఈ వారం చివర్లోనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇళ్లు గతంలో రాజకీయ వివక్షతో ఇళ్ల కేటాయింపులు జరిగాయని విమర్శించిన మంత్రి.. తమ ప్రభుత్వం మాత్రం అర్హతే ప్రామాణికంగా ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. ప్రతిపక్ష సభ్యులు సూచించిన అర్హులైన పేదల పేర్లను కూడా పరిశీలించి, అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఎక్కడైనా అర్హులైన పేదలకు అన్యాయం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
పాత ప్రభుత్వ స్థలాల్లో నెల రోజుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం గుర్తించిన ప్రభుత్వ స్థలాలు, సేకరించిన భూముల్లో ఇంకా కేటాయింపులు జరగని స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నెల రోజుల్లోగా ఆయా నియోజకవర్గాల్లో అర్హులైన పేదలకు ఈ స్థలాలు అందించేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
రూ.310–320 సిమెంట్ బ్యాగ్ రూ.230కే
ఇంటి నిర్మాణంలో ప్రధానమైన సిమెంట్ ధరను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.310–320 ఉన్న 50 కేజీల సిమెంట్ బ్యాగ్ను రూ.230కే పేదలకు అందించేలా ఒప్పందం పూర్తి చేశామని, త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. స్టీల్ను కూడా తక్కువ ధరకు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 59 వేల గుడిసెలకు రెండో విడతలో ప్రాధాన్యత
దశాబ్దాలుగా గుడిసెల్లోనే జీవిస్తున్న పేదలకు రెండో విడతలో శుభవార్త అందిస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 59 వేల గుడిసెలను రెండో విడతలో ప్రాధాన్యతగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో పైలట్ మోడల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారి భౌతిక పరిశీలన పూర్తిచేసి తుది జాబితా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్లో గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్లలోనూ ఇదే విధానాన్ని పైలట్ మోడ్లో అమలు చేస్తున్నామని, అవసరమైతే మున్సిపాలిటీల్లోనూ పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అసంపూర్తి 2BHKలకు రూ.750 కోట్ల చెల్లింపులు
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 2BHK ఇళ్లను పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వదిలిన 2BHK ఇళ్లకు సుమారు రూ.750 కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు.
అసంపూర్తి ఇళ్లకు రెండో విడతలో ప్రత్యేక అవకాశం
గతంలో వివిధ కారణాలతో సొంత డబ్బులతో ఫౌండేషన్, గోడలు లేదా స్లాబ్ వరకు నిర్మించి ఆగిపోయిన ఇళ్లకు కూడా ఈసారి ప్రత్యేక అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. రెండో విడతలో ప్రతి 2,000 ఇళ్లలో 500 ఇళ్లను అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కేటాయించే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
డ్వాక్రా మహిళలకు రూ.లక్ష అడ్వాన్స్
ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని, డ్వాక్రా మహిళా సంఘాల్లో సభ్యులైన పేదలకు రూ.లక్ష అడ్వాన్స్గా అందించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలు గుడిసెల నుంచి స్లాబ్ వేసిన ఇందిరమ్మ ఇళ్లలోకి మారేలా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలని కోరారు.





