పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలి
ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నిరసన
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1: సిపీస్
విద్రోహ దినం సందర్భంగా ప్రభుత్వ సిటీ కళాశాలలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు పెన్షన్ ఎంతో కీలకమని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జీవితంలో ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవకు అంకితం చేసిన అనంతరం పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పెన్షన్ అనేది కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కాదని, ఉద్యోగి భవిష్యత్ భద్రతకు సంబంధించిన హక్కు అని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్ అంజన్ కుమార్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సిపిఎస్ విధానంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అధ్యాపకులు హెచ్చరించారు.





