నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
హాలియా: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
రోజువారీ పర్యవేక్షణలో భాగంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు జంగాల కాలనీలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చైర్మన్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులు ముందుకు సాగుతున్న కొద్దీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిల్లులు కూడా దశలవారీగా అందుతాయని తెలిపారు.
అధికారులు సూచించిన కొలతలు, ప్రమాణాల ప్రకారమే ఇళ్లను నిర్మించుకోవాలని, అవసరానికి మించి ఖర్చు చేసి ఆర్థిక భారానికి గురికావద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను త్వరగా సాకారం చేసుకోవాలని చైర్మన్ కోరారు.





