అమరావతి సెప్టెంబర్ 5 ట్రైనెట్ (ఏపీ)
విద్యార్థులను భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు.
పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కోర్సులను రీస్ట్రక్చరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, డేటా అనలటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనరు.
దేశ భవిత అయిన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతికతతో పాటు విద్యార్థుల్లో విలువలు, సంస్కృతి, దేశభక్తి, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించాలని సూచించారు.
పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరింత పెరిగిందన్నారు. విద్య కేవలం థియరీకి పరిమితం కాకూడదని, విద్యార్థులు బయటకు వెళ్లి అనుభవపూర్వకంగా నేర్చుకునేలా అవకాశాలు కల్పించాలని సూచించారు.
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలనీ భవిష్యత్తును ముందుగానే ఊహించి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని సీఎం చెప్పారు.
పాలనా సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు తెలుగు వారిని అగ్రస్థానంలో నిలిపాయని పేర్కొన్నారు.
వచ్చే 10-15 ఏళ్లలో విభిన్నమైన భారతదేశాన్ని చూడబోతున్నామని అన్నారు.ఏడో తరగతి చదివే విద్యార్థులు సైతం ఏఐలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి పాఠశాలా మోడల్ స్కూల్గా మారితే కుటుంబాలు, గ్రామాలు, చివరకు దేశం మారుతుందని చెప్పారు.
2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలనీ, భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్గా ఉండాలనీ ఆ లక్ష్యానికి పునాది పాఠశాలల్లోనే పడాలని, దాన్ని సాధించేది ఉపాధ్యాయులేనని అన్నారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విద్యాబోధన సవాళ్లతో కూడిన అంశంగా మారిపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగా ఆధ్యాత్మికతను, యోగా, ధ్యానం లాంటి ఉత్తమ పద్ధతుల్ని అలవాటు చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
భారత్ మళ్లీ విశ్వగురు స్థానానికి రావాలంటే అది ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని... విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దాలని సీఎం ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 175 మంది ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సత్కరించారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ వర్లరామయ్య,ఎంపీ కేశినేని శివనాథ్ సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాజా పెంటపాటీ ట్రై నెట్ అమరావతి






